ప్రకాశం బ్యారేజీకి నీటి ఉద్ధృతి..ప్రజలకు హెచ్చరిక

అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన జిల్లా కలెక్టర్

విజయవాడ : ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరిగింది. ఈ క్రమంలో నదిపై ఉన్న అన్ని డ్యామ్ ల నీటిమట్టాలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. ఇన్ ఫ్లో ఎక్కువగా ఉన్న క్రమంలో… జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల రిజర్వాయర్ల నుంచి గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ఉద్ధృతి పెరుగుతోంది. ఈ సాయంత్రానికి బ్యారేజీకి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారింది. 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 30 గేట్లను 2 అడుగుల మేర, 40 గేట్లను ఒక్క అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/