గుండెపోటుతో ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది చనిపోతున్నారు – మంత్రి హరీష్ రావు

ఇటీవల కాలంలో గుండెపోటుతో చాలామంది చనిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా తర్వాత గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. వయసు తో సంబంధం లేకుండా మరణిస్తూ వస్తున్నారు. గుండెపోటుతో ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది చనిపోతున్నారని తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 4 వేల మంది సడెన్ గుండెపోటుతో చనిపోతున్నారని తెలిపారు .

సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన CPR శిక్షణ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సడన్ కార్డియాక్ అరెస్టుకు, హార్ట్ ఎటాక్‌కు మధ్య తేడా ఉందని తెలిపారు. మనిషి అప్పటికప్పుడు కుప్పకూలడమే కార్డియాక్‌ అరెస్ట్‌ అని, అప్పుడు చేసేదే సీపీఆర్‌ అని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

CPRపై కేవలం 2 శాతం మందికే అవగాహన ఉందని.. 98 శాతం మందికి అవగాహన లేదన్నారు. CPRపై అవగాహన లేకపోవడంతో చాలా మంది కార్డియక్ అరెస్ట్ తో చనిపోతున్నారని.. అందుకే కార్డియక్ అరెస్ట్ పై అవగాహన కలిపిస్తున్నామన్నారు మంత్రి. CPR చేయడానికి పెద్ద చదువు ఏమీ అవసరం లేదని.. అవగాహన ఉంటే చాలన్నారు. అన్ని శాఖల సిబ్బందికి CPRపై శిక్షణ ఇస్తున్నామని..సడన్ కార్డియక్ అరెస్ట్ కి, హార్ట్ ఎటాక్ కి తేడా ఉందని..అప్పటికప్పుడు కుప్పకూలితే అది కార్డియక్ అరెస్ట్.. అలా జరిగినప్పుడు చేసేదే CPR అంటారని వివరించారు.

సీపీఆర్‌ కాకుండా AED పరికరంతో కరెంట్ షాక్ ఇచ్చి కూడా సడన్‌ కార్డియాక్‌ అరెస్టు అయిన వారికి ట్రీట్‌మెంట్‌ చేస్తారని మంత్రి తెలిపారు. అయితే సీపీఆర్‌ అయినా, షాక్‌ ట్రీట్‌మెంట్‌ అయినా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో జరగాలని చెప్పారు. రాష్ట్రంలో రూ.1500 కోట్లతో 1200 AED మిషన్లను కొనాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.