కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు – గుత్తా సుఖేందర్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారాన్ని చేపట్టేంత మెజార్టీ రాదని , రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ రాబోతోందని… ఏ ఒక్క పార్టీకి 60 స్థానాలు వచ్చే అవకాశం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని… మరొక పార్టీతో కలవాల్సిందేనని తెలిపారు. ఈ వ్యాఖ్యల ఫై ఇప్పటికే పలువురు కాంగ్రెస్ , బిజెపి నేతలు స్పందించగా..తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఆయన అన్నారు.

నల్గొండలో క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోమటిరెడ్డి వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. హాంగ్ వస్తుందని కోమటిరెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. సర్వేల ప్రకారమే కేసీఆర్ టికెట్ల కేటాయింపుపై నిర్ణయం ఉండొచ్చని అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావన్న గుత్తా.. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వామపక్షాలతో పొత్తు ఉండొచ్చని అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వాస్తవ పరిస్థితి ప్రజలు తెలుసన్న ఆయన.. తెలంగాణ భవిష్యత్ కేసీఆర్ చేతిలో మాత్రమే సురక్షితంగా ఉంటుందన్న విషయం వారికి అర్థమైనందని అన్నారు.