గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్

group-2-candidates-petition-in-telangana-high-court

హైదరాబాద్‌ః గ్రూప్‌-2 పరీక్షను రద్దు చేయాలంటూ టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద అభ్యర్థులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. వివిధప్రాంతాల నుంచి వందలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు కమిషన్‌ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈనెల 29, 30న తలపెట్టిన గ్రూప్ 2 వాయిదా వేయాలని 150 మంది గ్రూప్ 2 అభ్యర్థులు పిటిషన్​లో పేర్కొన్నారు. వరుసగా పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2ని రీ షెడ్యూల్ చేయాలని కోరారు.

మరోవైపు.. టీఎస్పీఎస్సీ కార్యదర్శిని కలిసి పరీక్ష వాయిదా వేయాలని వినతి పత్రం అందించారు. ఛైర్మన్ లేకపోవడంతో కార్యదర్శిని కలిశామని.. కార్యదర్శి 48 గంటల సమయం అడిగారని అభ్యర్థులు చెప్పారు. ఏదో ఒక నిర్ణయం చెప్పేవరకు టీఎస్పీఎస్సీ ఆఫీసు నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థులు వెంటనే ఆందోళన విరమించి కార్యాలయం ముందు నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లేని యెడల అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారు. ఎవరెంత బెదిరించినా.. ఇవాళ పరీక్ష వాయిదా గురించి ప్రభుత్వం స్పందించే వరకు అక్కడి నుంచి కదలమని అభ్యర్థులు భీష్మించుకు కూర్చున్నారు.