రేషన్‌ కార్డుదారుల్లో అనర్హుల ఏరివేతకు కేంద్రం సిద్ధమైంది..

దేశ వ్యాప్తంగా రేషన్ కార్డుల సంఖ్య ను తగ్గించేందుకు కేంద్రం సిద్ధమైంది. అర్హత లేని వారు వెంటనే కార్డులను సరెండర్‌ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తుంది.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి కోత పడుతుందోనని కార్డుదారుల్లో టెన్షన్‌ మొదలైంది. ఏపీలోని 26జిల్లాల్లో సుమారు 1.4కోట్ల తెల్ల కార్డులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనల నేపథ్యంలో వాటిలో ఎన్ని ఉంటాయో, ఊడుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013ను అనుసరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ కార్డులు జారీ చేశాయి. వీటిని పుడ్‌ సెక్యూరిటీ కార్డులని కూడా పిలుస్తారు. కరోనా నుంచి దారిద్య్ర రేఖకు దిగువన ఉండి… రేషన్‌ కార్డులో ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది.

ఈ ఏడాది నవంబరు వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో అధికారులను తప్పుదారి పట్టించి కొంత మంది రేషన్‌కార్డుల ద్వారా రేషన్‌తో పాటు మరికొన్ని ఉచితాలు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంది. అలాంటి వారు తక్షణం తమ కార్డులు సరెండర్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది.