గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌

రిపబ్లిక్ డే ప్రసంగంలో సీఎం కెసిఆర్ పై గవర్నర్ పరోక్ష విమర్శలు

kavitha-satires-on-tamilisai

హైదరాబాద్‌ః తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత మండిప‌డ్డారు. ఈ మేర‌కు క‌విత ట్వీట్ చేశారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే , దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అని క‌విత గుర్తు చేశారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నాము అని తెలిపారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కెసిఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు అని క‌విత త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, ఈరోజు గవర్నర్ మాట్లాడుతూ… కొందరికి ఫామ్ హౌసులు ఉండటం కాదని… అందరికీ నివసించడానికి ఇళ్లు ఉండాలని అన్నారు. అభివృద్ధి అంటే కొత్త బిల్డింగులు కట్టడం కాదని… దేశాన్ని నిర్మించడమని చెప్పారు. జాతీయ రహదారులు, వందేభారత్ తదితర అంశాలకు సంబంధించి ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/