భద్రాచలం వద్ద మరోసారి పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మరోసారి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అధికారులను సన్నద్ధంగా ఉంచాలన్నారు. సచివాలయంలో తక్షణమే కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
సోమవారం ఉదయం 8 గంటలకు 39.50 అడుగులకు చేరింది. నదిలో 7,81,614 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. మరికొన్ని గంటల్లో వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకోవచ్చని కేంద్ర జల వనరుల సంఘం అధికారులు తెలిపారు. గోదావరి పరివాహంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
గత 24 గంటల్లోనే గోదావరిలో ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎగువన మహారాష్ట్ర గైక్వాడ్ నుంచి కేవలం 57 వేల క్యూసెక్కులు వస్తుండగా.. సింగూరు, నిజాంసాగర్తోపాటు రాష్ట్రంలోని స్థానిక వాగుల ద్వారా ఎస్సారెస్పీకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఈ ఏడాది జూలై నెలలో ఒకసారి, ఆగస్టు నెలలో ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి. తాజాగా మరోమారు భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తడంతో లోతట్టు కాలనీ వాసులు, ముంపు వాసులు ఆందోళన చెందుతున్నారు.