నేడు పార్టీ పేరును ప్రకటించనున్న గులాం నబీ ఆజాద్!
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో పార్టీ ప్రారంభంకానుంది. నేడు పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆజాద్ ప్రకటించే అవకాశం ఉన్నది. సోమవారం మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ పేరును వెల్లడించనున్నారు. కాగా, జాతీయ పార్టీనే ప్రకటిస్తారని తెలుస్తున్నది. అయితే ముందుగా జమ్ముకశ్మీర్తో ప్రారంభించి ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు విస్తరించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కశ్మీర్లో ఒంటరిగా పోటీచేయనున్న ఆయన.. ఇతర పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకోనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు.
గతనెలలో ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్కు పార్టీ నడిపే సామర్థ్యం లేదని విరుచుకుపడ్డారు. పార్టీలో మారిన పరిస్థితులే తన రాజీనామాకు కారణమని వెల్లడించారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/