నేడు ఢిల్లీ కంటోన్మెంట్ శ్మశానవాటికలో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు

హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ మరియు ఆయన సతీమణి మధులికా రావత్ల అంత్యక్రియలు ఈరోజు ఢిల్లీలోని కంటోన్మెంట్ శ్మశానవాటికలో జరగనున్నాయి. గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలను సైనిక విమానంలో దిల్లీకి తరలించారు. దిల్లీలోని పాలం ఎయిర్​బేస్​కు బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులిక రావత్​తో పాటు 11 మంది సైనికుల పార్థివదేహాలను తీసుకురాగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అమరుల భౌతికకాయాలకు నివాళ్లు అర్పించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రావత్​ దంపతుల భౌతికకాయాలను శుక్రవారం వారి నివాసానికి తరలించి.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత కామరాజ్ మార్గ్ నుంచి దిల్లీ కంటోన్మెంట్​లోని బ్రార్​ స్క్వేర్ శ్మశానవాటికకు అంతిమయాత్రగా తీసుకువెళ్లి.. అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో హెలికాప్టర్​ ప్రమాదానికి గురై బిపిన్​ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.