ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత
ప్రజా గాయకుడు గద్దర్ ఇకలేరు. అనారోగ్యంతో ఆయన ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ 1949లో మెదక్ జిల్లా తూప్రాన్ జన్మించారు. గద్దర్ ఒక భారతీయ కవి, విప్లవ బాలడీయర్, ఉద్యమకారుడు. 1987లో కారంచేడు దళితులహత్యలపై పోరాడిన గద్దర్.. నకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. తరువాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో చేరి.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు. 1997 ఏప్రిల్ 6న నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గద్దర్పై కాల్పులు జరిగాయి.
కాగా, గద్దర్ నిజామాబాదు జిల్లా మహబూబ్నగర్, హైదరాబాద్లో విద్యభ్యాసం పూర్తి చేశారు. కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకతలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో ఎంతో చైతన్యం కలిగించేవి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్లకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు క్యాసెట్లుగా, సిడీలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి. గద్దర్ మరణం ఫై రాజకీయ ప్రముఖులు , సినీ ప్రముఖులు , ఉద్యమకారులు ఇలా అంత సంతాపం వ్యక్తం చేస్తున్నారు.