ఢిల్లీకి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు లేదా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న జగ్గారెడ్డి

Former MLA Jagga Reddy left for Delhi

హైదరాబాద్‌ః టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దాదాపు ఇరవై నిమిషాల పాటు సమావేశమైన జగ్గారెడ్డి… ఈ రోజు ఢిల్లీకి బయలుదేరడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రైల్లో ఢిల్లీకి బయలుదేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

త్వరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. తన కూతురు లేదా భార్యకు రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ స్థానాన్ని ఆయన ఆశిస్తున్నారు. అదే సమయంలో తనకు ఎమ్మెల్సీ లేదా పీసీసీ అధ్యక్ష పదవిని ఆయన అధిష్ఠానాన్ని కోరుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఆయన ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.