సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి లేఖ

CM Revanth Reddy

హైదరాబాద్ః తెలంగాణలో కమ్మ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన అన్ని కులాల సంక్షేమం కోసం కార్పోరేషన్ల ఏర్పాటు చేయాలన్న నిర్ణయం అభినందనీయమన్నారు. చట్టపరంగా కమ్మవారు అగ్రవర్ణమే అయినప్పటికీ ఈ కులంలో మెజార్టీ ప్రజలు పేదరికంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

పిల్లలకు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లో వారి చదువులు మధ్యలోనే ఆపేసే పరిస్థితులు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా కులాల మాదిరిగానే కమ్మ వారి సంక్షేమం కోసం కమ్మ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఇలా చేస్తే కమ్మ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసిన తొలి ముఖ్యమంత్రిగా మీ పేరు నిలుస్తుందన్నారు. కమ్మ కార్పోరేషన్‌పై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన లేఖ రాశారు.