చెన్నై వరదల్లో చిక్కుకున్న వారికి హెలికాప్టర్ల వాయుసేన ఆహారం అందజేత
చెన్నై: మిగ్జాం తుఫాన్ తాకిడికి చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైకి వరదనీరు రావటంతో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అక్కడ వరుణుడు శాంతించాడు. అయినప్పటికీ నగరంలోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇంకా తొలగిపోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా కరెంటు, ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న వారికి హెలికాప్టర్ల ద్వారా భారత వాయు సేన ఆహార ప్యాకెట్లను అందజేస్తోంది. కొందరు సినీ నటులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం నగరంలో వరదల్లో చిక్కుకున్న వారికి తమ వంతు సాయం అందిస్తున్నారు.
కాగా, తుఫాన్ ప్రభావంతో తమిళనాడు భారీగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇవాళ కేంద్రానికి లేఖ రాశారు. తక్షణ సాయం కింద రూ.5,060 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోడీChennaiని కోరుతూ సీఎం స్టాలిన్ లేఖ రాశారు. మిగ్జాం వల్ల నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర సర్కారు బృందాన్ని పంపాలని ఆయన కోరారు. అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు.