ఇరాన్పై కక్ష సాధింపు చర్యలకు ఈయూ వత్తాసు
టెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) వత్తాసు పలుకుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జరీఫ్ తెలిపారు. ఇరాన్ ఆర్థికవ్యవస్థను దిగజార్చాలని అమెరికాతో పాటు ఈయూ కూడా కుట్ర పన్నిందన్నారు. అందుకే, ఇరాన్ నుంచి చమురు ఎగుమతుల కోసం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఈయూ రద్దు చేసుకుందన్నారు. 2015లో ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవడంలో ఈయూ కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఒప్పందంలోని నిబంధనలను ఈయూ ఉల్లంఘంచిందన్నారు. చరిత్రాత్మక ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడమే కాకుండా మిత్రదేశాలను కూడా ఈడీల్ నుంచి బయటకు రావాలని ఒత్తిడి పెంచిందన్నారు. అణు ఒప్పందం నుంచి వైదొలగాలని బ్రిటన్, ఈయూ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలపై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారనని జవాద్ జరీఫ్ తెలిపారు. అంతేగాకుండా, భారీ ఆంక్షలు మోపి ఇరాన్ ఆర్థికవ్యవస్థను దెబ్బతీసేందుకు ట్రంప్ కుట్ర పన్నారని విమర్శించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/