‘‘గుడ్ ఫర్ ఇండియా’’..చంద్రయాన్ 3పై స్పందించిన ఎలాన్ మస్క్

Elon Musk reacts to Chandrayaan-3 vs ‘Interstellar’ budget

న్యూఢిల్లీః టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ భారత్ చంద్రయాన్ 3 ప్రయోగంపై స్పందించారు. భారత్ చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్ 3లో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. సాయంత్రం 6 గంటల సమయంలో చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగనుంది. ఇది సక్సెస్ అయితే అంతరిక్ష పరిశోధన, ప్రయోగాల్లో భారత్ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది.

మన దేశం చంద్రయాన్-3 ప్రయోగాన్ని కేవలం రూ.622 కోట్లకే (75 మిలియన్ డాలర్లు) చేపట్టడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిపై మాజీ జర్నలిస్ట్ సిండీ పామ్ తన న్యూస్ థింక్ సంస్థ అధికారిక హ్యాండిల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఎంత క్రేజీ.. చంద్రయాన్-3 బడ్జెట్ (75 మిలియన్ డాలర్లు) ఇంటర్ స్టెల్లర్ సినిమా వ్యయం (165 మిలియన్ డాలర్లు) కంటే తక్కువ’’ అంటూ అందులో పేర్కొన్నారు. దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ ‘‘గుడ్ ఫర్ ఇండియా’’ (భారత్ కు మంచిది) అని కామెంట్ పెట్టారు.

దీనికి యూజర్లు సైతం అదే విధంగా స్పందిస్తున్నారు. అభినందించినందుకు ధన్యవాదాలు అని ఓ యూజర్ పేర్కొనగా, ఎట్టకేలకు ప్రజలు భారత్ సత్తా ఏంటో తెలుసుకుంటున్నారు అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఎలాన్ మస్క్ కు స్పేస్ టెక్నాలజీపై మంచి అవగాహన ఉంది. అంతేకాదు ఆసక్తి కూడా ఎక్కువే. అందుకే స్పేస్ ఎక్స్ పేరుతో ఓ పెద్ద కంపెనీనే నిర్వహిస్తున్నారు.