బాలుడి హత్య కేసు.. జిల్లా కోర్టు సంచలన తీర్పు.. ముద్దాయికి మరణ శిక్ష..!

death-sentence-to-the-accused-in-the-case-of-murder-of-a-boy

హైదరాబాద్‌ః మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దీక్షిత్ రెడ్డి హత్య కేసులో ముద్దాయి సాగర్ కి మరణ శిక్ష విధించింది. 2020, అక్టోబర్ 18న తొమ్మిదేళ్ల దీక్షిత్ రెడ్డిని అత్యంత కిరాతకంగా చంపాడు సాగర్. ఇంటి బయట ఆడుకుంటున్న దీక్షిత్ ను శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. పెట్రోల్ బంక్ కి వెళ్దామని చెప్పి.. తన బైకుపై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. ఆ తరువాత గుట్టల్లోకి తీసుకెళ్లి మంచి నీళ్లతో తనతో పాటు నిద్ర మాత్రలను కలిపి తాగించాడు.బాలుడికి అనుమానం రాకుండా ఉండేందుకు తాను కూడా ఆ నీటిని తాగాడు. బాలుడు మత్తులో ఉండగానే గొంతు నులిమి హత్య చేశాడు.

హత్య తరువాత ప్రదేశం నుంచి బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. బాలుడి ఇంటి దగ్గరికి వెళ్లి తల్లిదండ్రులు, బంధువుల రియాక్షన్ గమనించాడు. కొంత సమయం తరువాత బాలుడి మృతదేహం వద్ద ఉన్న ప్రదేశానికి వెళ్లి మంద సాగర్ విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో దీక్షిత్ బాడీపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మూడు రోజుల తరువాత దీక్షిత్ రెడ్డి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు.

తాజాగా జిల్లా కోర్టు తీర్పుపై దీక్షిత్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ తీర్పును వెలువరించారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు, ప్రధాన న్యాయమూర్తికి పాలాభిషేకం చేశారు.