డ్రైవర్ కు గుండెపోటు.. ఆగి ఉన్న కారును ఢీ కొట్టిన లారీ

కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలు

driver-got-heart-attack-while-driving-and-lorry-hits-car-in-hyderabad

హైదరాబాద్‌ః హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ లో సోమవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో లారీపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో హైవే పక్కన ఆగి ఉన్నఓ కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారుతో పాటు లారీ డ్యామేజ్ కాగా కారులో ఉన్నవారికి స్వల్పంగా గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ మాత్రం గుండెపోటు కారణంగా చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్నూలు నుంచి ధాన్యం లోడును లారీ హైదరాబాద్ కు తీసుకు వస్తోంది. ఈ క్రమంలో రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల దగ్గరికి రాగానే డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. లారీపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న ఓ కారును ఢీకొట్టి లారీ ఆగింది. డ్రైవర్ ను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గుండెపోటు కారణంగా అప్పటికే చనిపోయాడని డ్రైవర్ ను పరీక్షించిన వైద్యులు తెలిపారు.