జూలై 12న హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

draupadi murmu

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ..జులై 12 న హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు ద్రౌపది ముర్ము చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆమె బిజెపి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు లను కలవనున్నారు. రీసెంట్ గా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు రావడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ ఆయనకు గ్రాండ్ గా వెల్ కం చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రాబోతున్నారు.

దేశంలోనే అత్యున్నత పదవి అయిన భారత రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలపైనే ఫోకస్ చేసాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన 64 ఏళ్ల ద్రౌపది ముర్ము.. ఆదివాసీ (ఎస్టీ) సామాజికవర్గానికి చెందిన వారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్​భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించారు. ఝార్ఖండ్ గవర్నర్​గా పనిచేశారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్​చరణ్ ముర్ము. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము.. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. వివాదాలు లేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2015-2021 వరకు జార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేశారు. జార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌ అయిన ముర్ము 2000-04 మధ్యలో ఒడిశా రవాణా, ఫిషరీస్‌ శాఖల మంత్రిగా పని చేశారు.