డీకే శివకుమార్ కలిసిన మోత్కుపల్లి నర్సింహులు

అక్టోబర్ మొదటి వారంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం

DK Shivakumar meet Motkupalli Narasimhulu

బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో బిఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారని సమాచారం. అక్టోబర్ మొదటి వారంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పై మోత్కుపల్లి నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ ను తక్షణమే ఖండించాలని కెసిఆర్ ను ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు మోత్కుపల్లిని పార్టీలో చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు కూడా ఆసక్తిని చూపుతున్నారు. బెంగళూరులో డీకేను కలవడంతో కాంగ్రెస్ లో ఆయన చేరిక లాంఛనమే అని తెలుస్తోంది. తెలంగాణలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. రానున్న రోజుల్లో చేరికలు మరింత ఊపందుకుంటాయని చెపుతున్నారు.