బిఆర్ఎస్ ఎదురు దెబ్బ ..సిఎంని కలిసిన డిప్యూటీ మేయర్ శ్రీలత దంపతులు

బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు

Deputy Mayor Srilatha couple who meet CM Revanth Reddy

హైదరాబాద్‌ః తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కాంగ్రెస్ సొంతమయ్యాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా విజయాలు దక్కాయి. అయితే హైదరాబాద్ లో మాత్రం బిఆర్ఎస్ పూర్తి ఆధిక్యతను కనపరిచింది. దీంతో, కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో హైదరాబాద్ పై ఫోకస్ చేసింది.

జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బిఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తన భర్త శోభన్ రెడ్డితో కలిసి ఆమె సీఎంతో భేటీ అయ్యారు. రెండు రోజుల్లో శ్రీలత దంపతులు కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ సందర్భంగా వీరితో పాటు ఫసీయుద్దీన్ కూడా ఉన్నారు.

కొంత కాలంగా బిఆర్ఎస్ హైకమాండ్ పై శ్రీలత దంపతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శోభన్ రెడ్డి బిఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దంపతులు మీడియాతో మాట్లాడుతూ… కెసిఆర్, కెటిఆర్ తమను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.