హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన
12.08 నిమిషాలకు ఏటీసీతో తెగిన హెలికాప్టర్ లింక్: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ : నేడు లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతిచెందినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ లైఫ్ సపోర్ట్పై ఉన్నారని, ఆయన్ను బ్రతికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మరణించినవారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు. వెల్లింగ్టన్ కాలేజీ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేందుకు అక్కడకు వెళ్లారన్నారు. సులూరు ఎయిర్బేస్ నుంచి హెలికాప్టర్ ఎగిరిందని, 12.08 నిమిషాలకు ఆ హెలికాప్టర్తో ఏటీసీ సంబంధాలు తెగిపోయాయన్నారు. అయితే మంటల్లో కాలిపోతున్న హెలికాప్టర్ను స్థానికులు చూశారని, దాంట్లో ప్రాణాలను కొట్టుమిట్టాడుతున్నవారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు.
ప్రమాదంలో మృతిచెందిన రక్షణ దళ సిబ్బంది పేర్లను రాజ్నాథ్ చదివి వినిపించారు. పార్డీవ దేహాలను వైమానిక దళ విమానంలో ఇవాళ ఢిల్లీకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. ఎయిర్ చీఫ్ మార్షెల్ చౌదరీ నిన్ననే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు. ఘటనపై ట్రై సర్వీస్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు చెప్పారు. ఎయిర్ మార్షల్ మనవేంద్ర సింగ్ నేతృత్వంలో విచారణ జరగనున్నది. విచారణ అధికారులు నిన్ననే వెల్లింగ్టన్ చేరారని, వాళ్లు దర్యాప్తు కూడా మొదలుపెట్టినట్లు చెప్పారు. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రాజ్నాథ్ తెలిపారు. స్పీకర్ ఓం బిర్లా కూడా నివాళి అర్పించారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/