రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్​పై బాంబులు వేస్తోన్న ర‌ష్యా

కీవ్‌లోని ప‌లు ప్రాంతాల్లో బాంబుల శ‌బ్దాలు

కీవ్: ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్ మొత్తాన్ని త‌మ అధీనంలోకి తెచ్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా రెండో రోజు కూడా ఉక్రెయిన్‌లోని కీల‌క ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన ర‌ష్యా బ‌ల‌గాలు దాడులు జ‌రుపుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ సైనిక స్థావ‌రాలు, ప్ర‌భుత్వ ఆస్తుల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ర‌ష్యా బాంబుల‌తో దాడులు చేస్తోంది.

రాజ‌ధానిని స్వాధీనం చేసుకుంటే ర‌ష్యా ఆక్ర‌మ‌ణ పూర్త‌యిన‌ట్లుగానే భావించ‌వ‌చ్చు. ఈ రోజు ఉద‌యం నుంచి కీవ్‌లోని ప‌లు ప్రాంతాల్లో బాంబుల శ‌బ్దాలు విన‌ప‌డ్డాయని అక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు. అలాగే, కీవ్‌లోని ఓ అపార్ట్ మెంట్ బిల్డింగ్ దెబ్బ‌తింది. దీంతో అందులోని ముగ్గురు గాయప‌డ్డారు. భారీ పేలుళ్ల‌ శబ్దాలతో కీవ్ నగర ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ప‌లు అపార్ట్‌మెంట్లపై బాంబులు ప‌డుతుండ‌‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప‌లు మీడియా సంస్థ‌లు ఇందుకు సంబంధించిన‌ వీడియోలు, ఫొటోల‌ను బ‌య‌ట‌పెడుతున్నాయి. ప్రాణ న‌ష్టంపై అధికారులు కూడా అంచ‌నాకు రాలేక‌పోతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/