కోస్తాలో వచ్చే 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు: వాతావరణ శాఖ

ఎల్లుండి వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని

Heavy Rain

అమరావతిః దక్షిణ ఒడిశా పరిసరాల్లో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఉండడంతో వచ్చే 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి వైపునకు వంగి ఉన్నట్టు పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయని, ఎల్లుండి వరకు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం సూచించింది. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి 12వ తేదీ మధ్య 45 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 75 శాతం అధికంగా 78.7 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/