టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమాచారంతోనే రైడ్‌ చేశాం – సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని బిజెపి పార్టీ ..అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లను కొనుగోలు చేసేందుకు ట్రై చేసింది. కానీ వారి ప్లాన్ రివర్స్ అయ్యింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే లతో పీఠాధిపతి రామచంద్రభారతి, బీజేపీ నేత నందకుమార్, సింహయాజులు బేరసారాలు ఆడుతుండగా..పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. తమకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే లే సమాచారం ఇచ్చారని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు.

ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్‌ మీడియాతో మాట్లాడుతూ..తమను కొంతమంది ప్రలోభపెడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సమాచారం అందించారని సీపీ అన్నారు. డబ్బు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని ఆశచూపారని, వారిచ్చిన సమాచారంతో ఫామ్‌ హౌజ్‌పై రైడ్‌ చేశామన్నారు. ఈ రైడ్‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన పీఠాధిపతి రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. రామచంద్రభారతితో పాటు ఫామ్‌హౌజ్‌లో తిరుపతి నుంచి వచ్చిన సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ ఉన్నారని చెప్పారు. వీళ్లు ఏమని ప్రలోభ పెట్టారనే దానిపై విచారణ జరుపుతున్నామని.. వీరిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటామని తెలిపారు.

నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసింది. వీరు భారీగా డబ్బులు ఎర వేసేందుకు ప్రయత్నిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఇప్పటివరకు రూ.15 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు.