పవన్ కళ్యాణ్ కు కోవిడ్ పాజిటివ్
వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్స
Hyderabad: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న తరవాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయక్షేత్రంలోనే క్వారంటైన్ కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.
దీంతోరెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్ గా ఫలితం వచ్చింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్తం గెళ్ళ సుమన్ హైదరాబాద్ కు వచ్చి పవన్ కళ్యాణ్ కు చికిత్స ప్రారంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు. అన్నయ చిరంజీవి , వదిన శ్రీమతి సురేఖ తోపాటు రామ్ చరణ్, శ్రీమతి ఉపాసన ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పరీక్షించింది. అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డి పవన్ కళ్యాణ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/