కర్ణాటక ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

congress

బెంగళూర్‌ః కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ ఈరోజు 42 మంది అభ్య‌ర్ధుల‌తో కూడిన‌ రెండో జాబితా ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో బిజెపి నుంచి హ‌స్తం గూటికి చేరిన బాబూరావు చిచ‌న్సూర్‌, ఎన్‌వై గోపాల‌కృష్ణ‌ల‌కు చోటు ద‌క్కింది. బాబూరావు గుర్మిత్క‌ల్ సీటు నుంచి బ‌రిలో దిగ‌నుండ‌గా, గోపాల‌కృష్ణ మొల్క‌ల్మూర్ నుంచి పోటీ చేయ‌నున్నారు. బ‌స‌వ‌రాజ్ బొమ్మై సార‌ధ్యంలోని పాల‌క బిజెపి స‌ర్కార్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వెల్ల‌వెత్త‌డం, ప్ర‌జా వ్య‌తిరేకత తీవ్రంగా ఉండ‌టంతో అధికారం ద‌క్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. అభ్య‌ర్ధుల ఎంపిక‌ను ఆచితూచి చేప‌ట్ట‌డంతో పాటు ముఖ్య‌నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యంతో ముందుకెళుతోంది.

మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేకత ప్ర‌బ‌ల‌డంతో దిక్కుతోచని క‌మ‌ల‌నాధులు సినీ న‌టులను రంగంలోకి దింపుతున్నారు. క‌న్న‌డ న‌టుడు కిచ్చా సుదీప్‌ను స్టార్ క్యాంపెయిన‌ర్‌గా బిజెపి ప్ర‌క‌టించ‌డంపై కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. బిజెపి నేత‌ల ప్ర‌సంగాల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో జ‌నం దృష్టిని ఆక‌ట్టుకునేందుకు కాషాయ నేత‌లు సినీ న‌టుల కోసం అర్రులుచాస్తున్నార‌ని, ఇది బిజెపి దివాళాకోరుత‌నానికి నిద‌ర్శ‌న‌మని కాంగ్రెస్ ప్ర‌తినిధి ర‌ణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా అన్నారు.