పీవీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింది… అవమానించిందిః కెటిఆర్
జీవితమంతా కాంగ్రెస్ కోసం సేవ చేసిన వ్యక్తిని కాంగ్రెస్ దారుణంగా అవమానించిందన్న కెటిఆర్
హైదరాబాద్ః దివంగత పీవీ నరసింహారావు అంటే సోనియాగాంధీకి అభిమానమని వ్యాఖ్యానించిన ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీకి మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ… పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం గురించి ఆమెకు తెలియకపోవడం నిజంగా దురదృష్టకరమన్నారు. పీవీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని, అవమానించిందని మండిపడ్డారు. మనమంతా అభిమానించే వ్యక్తి పీవీ… భూమి పుత్రుడు… తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన అలాంటి మానవతామూర్తి, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందన్నారు.
1996లో సిట్టింగ్ ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావుకు ఎంపీ టికెట్ నిరాకరించి… కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ మరణించినప్పుడు కనీసం 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి ఆయన భౌతికకాయాన్ని అనుమతించకుండా అవమానించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణమన్నారు. పీవీ కుటుంబానికి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.