మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలియజేయాలంటూ సీఎం ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి..ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.

అలాగే నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. ఇక ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.