నేడు ఢిల్లీలో బిఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సిఎం కెసిఆర్

cm-kcr-to-inaugurate-brs-central-office-in-delhi-today

న్యూఢిల్లీః ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మించిన బిఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించనున్నారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు. ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. అనంతరం పార్టీ సమావేశపు హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు.

పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్లను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌ రెండు రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వెంకటేశ్‌, కార్పొరేషన్ల చైర్మన్లు కోలేటి దామోదర్‌, దూదిమెట్ల బాలరాజుయాదవ్‌, ఒడపల్లి మాధవ్‌ తదితరులు పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీ ప్రారంభోత్స నేపథ్యంలో వసంత్‌విహార్‌ సమీప రోడ్లు, అశోక్‌రోడ్డు, తెలంగాణభవన్‌ పరిసరాల్లో కెసిఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఆయా ప్రాంతాలన్నీ గులాబీమయమై కొత్త శోభను సంతరించుకున్నాయి. నూతన కార్యాలయంలో పార్టీ అధినేత చాంబర్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌తోపాటు ప్రత్యేక గదులన్నింటినీ పూలతో అలంకరించారు. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇప్పటికే కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

కాగా, 2021 సెప్టెంబర్‌లో భవనానికి కెసిఆర్ శంకుస్థాపన చేశారు. అత్యంత వేగంగా నిర్మాణం పూర్తైంది. నాలుగు అంత‌స్తుల‌తో ఉంటుందీ బిల్డింగ్. లోయ‌ర్ గ్రౌండ్‌లో మీడియా హాల్, స‌ర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యద‌ర్శుల ఛాంబ‌ర్లు ఏర్పాటు చేశారు. ఇక మొదటి అంతస్తులో బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుని ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. 2, 3వ అంతస్తుల్లో మొత్తం 20 రూములు నిర్మించారు. వీటిలో ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ పోగా.. మిగతా 18 ఇతర రూములు పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయి.