స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ః తెలంగాణలో ఈరోజు నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కళాకారులు ఈ వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. హెచ్ఐసీసీకి చేరుకున్న కేసీఆర్ మొదటగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత చిత్రపటానికి పూల మాల వేసి.. వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా హెచ్ఐసీసీలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేదికపై 75 మంది కళాకారులతో నిర్వహించిన వీణావాయిద్య ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.
మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది. ఈ నెల 9 నుంచి 21 వరకు రాష్ట్రంలో 562 సినిమా హాళ్లలో ఉదయం పూట పాఠశాలల విద్యార్థుల కోసం రిచర్డ్ అటెన్బరో నిర్మించిన ‘గాంధీ’ చిత్రాన్ని ప్రదర్శిస్తారు. ఈ నెల 21న శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 15నుంచి పింఛనుకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/