గంటల్లో బాధితురాలికి సాయం అందించి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్

సీఎం జగన్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. గంటల వ్యవధిలో బాధితురాలికి సాయం అందించి వార్తల్లో నిలిచారు. సోమవారం వినుకొండ లో జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ కు పలువురు స్థానికులు క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ఇందులో మస్తానమ్మ కూడా ఒకరు.

వినుకొండకు చెందిన మస్తానమ్మ ఇల్లు రెండు ఏళ్ల క్రితం మంటల్లో కాలిపోయింది. అప్పటి నుండి ఉండడానికి గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇదే విషయాన్ని సీఎం జగన్‌ను కలిసి తన ఆవేదనను తెలిపింది. దీంతో.. వెంటనే సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే బాధితురాలి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరఫున సాయం అందించారు. అలాగే బాపట్ల జిల్లాకు చెందిన నారాయణస్వామి కుమారుడు చిరంజీవి తేజ రెండో తరగతి చదువుతున్నాడు. కానీ.. చిరంజీవి తేజ థలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేసిన ఆ కుటుంబం.. ఆర్థికంగా చితికిపోయింది. దీంతో తన కుమారుడికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్ధిక స్ధోమత లేదని.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు తేజ తండ్రి. వెంటనే స్పందించిన జగన్.. తక్షణ సహాయం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్‌ శివశంకర్‌, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కలిసి మస్తానమ్మకు ఇంటి స్ధలం, ఇల్లు కట్టుకోవడానికి నగదు, తక్షణ సహాయంగా రూ. 50,000 అందించారు.
అలాగే చిరంజీవి తేజకు తక్షణ సహాయంగా లక్ష రూపాయలు అందించారు, చికిత్సకు అవసరమైన మిగిలిన సాయాన్ని కూడా సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఇలా బాధితులకు వెంటనే సాయం అందించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.