ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల చెల్లింపులపై సీఎం జగన్‌ కీలక నిర్ణయం

cm-jagan-regime-good-news-to-apsrtc-promoted-employees-orders-to-implement-new-prc-benefits

అమరావతిః ఏపిలోని ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్‌ సర్కార్‌ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో పీఆర్సీ ప్రయోజనం కల్పించిన సర్కార్.. ఇప్పుడు ఆర్టీసీలో ఉద్యోగులకు కూడా దాన్ని వర్తింపచేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆర్టీసలో మెజారిటీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రయోజనాలు అందిస్తోన్న ప్రభుత్వం తాజాగా పదోన్నతి పొందిన ఉద్యోగులకూ కూడా పీఆర్సీ వర్తించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పదోన్నతి పొందిన ఉద్యోగులకూ కొత్త పీఆర్‌సీ ప్రకారం వేతనాలు వచ్చేలా సీఎం జగన్‌ చొరవతో జీవో విడుదలైంది. వీరికి పాత బకాయిలతో కలిపి వేతనాలు చెల్లించేలా ఉత్తర్వులు ఇచ్చారు.

ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,096 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీలో 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2,096 మందికి పదోన్నతి లభించింది. డీపీసీ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతి లేకుండా పదోన్నతి కల్పించారంటూ ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పీఆర్‌సీ వీరికి వర్తింపజేయడం కుదరదని తెగేసి చెప్పింది. పదోన్నతి పొందిన వారిని మినహాయించి 49,392 మందికి 2022 సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ఇటీవల సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాయి.

సీఎం సానుకూలంగా స్పందించి.. వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో ఫలితంగా పదోన్నతి పొందిన వారికి కూడా కొత్త పీఆర్‌సీ వర్తింపజేస్తూ బకాయిలతో సహా చెల్లించేలా ఈ నెల 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో 27 మంది డిపో మేనేజర్లు, 18 మంది అసిస్టెంట్‌ డీఎంలు, 148 మంది గ్రేడ్‌–1 కండక్టర్లు, 332 మంది గ్రేడ్‌–1 డ్రైవర్లు, 197 మంది అసిస్టెంట్‌ డిపో క్లర్కులు, 345 మంది ఆర్టిజాన్‌లు, 198 మంది మెకానిక్‌లు, 322 మంది సూపర్‌వైజర్లు,44 మంది సెక్యూరిటీ విభాగం వారితో పాటు ఇతరులు 465 మంది ఉన్నారు.