టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అర్జునుడు.. ఇటీవలే గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో గురువారం తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు.

బచ్చుల అర్జునుడు మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. బచ్చుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా బచ్చుల మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అర్జునుడు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఎమ్మెల్సీ బచ్చు అర్జునుడు మరణం అత్యంత విషాదకరం అని చంద్రబాబు పేర్కొన్నారు. గుండెపోటుకు గురై నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని భావించామని కానీ ఇలా జరగడం తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. అర్జునుడు మృతి పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

అటు, యువగళం పాదయాత్రలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు మృతి చెందిన సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. నిజాయతీకి మారుపేరు, అజాతశత్రువు అయిన అర్జునుడు పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని లోకేశ్ కొనియాడారు. ఆయన కన్నుమూయడం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు.