జెండా ఊపి ఈ-ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్‌

cm-jagan-mohan-reddy-flagged-off-distribution-of-516-e-autos-at-tadepalli-camp-office

అమరావతిః చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే ఈ-ఆటోలను గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఈ–ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టీలకు పంపిణీ చేయనున్నారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ఈ– ఆటోల డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో పంపిణీ చేశారు. గ్రేడ్‌–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్‌ టిప్పర్లను వినియోగిస్తోంది. అలాగే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది.

81 మున్సిపాలిటీల్లో రూ.156.61 కోట్లతో 135 చెత్త బదిలీ స్టేషన్లను (జీటీఎస్) ఏర్పాటు చేస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. APలో 71 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌లు, 29 చెత్త నుంచి కంపోస్ట్ ప్రాజెక్ట్‌లు, 4 బయో-మిథనాల్ ప్రాజెక్ట్‌లు తడి చెత్త నిర్వహణ కోసం ఉన్నాయి. లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో ప్రభుత్వం రూ.1,445 కోట్లతో 206 సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లను నిర్మిస్తోంది. 1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న 55 మునిసిపాలిటీలలో ఫేకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లను (ఎఫ్‌ఎస్‌టిపి) కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.