నీటి వివాదం పై స్పందించిన సీఎం జగన్

తెలంగాణలో ఏపీ వాళ్లు ఉన్నారని ఆలోచిస్తున్నా… అందుకే ఎక్కువగా మాట్లాడడంలేదు: సీఎం జగన్

అమరావతి: సీఎం జగన్ క్యాబినెట్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో నీటి వివాదాల నేపథ్యంలో ఆయన స్పందించారు. తెలంగాణలో ఏపీ వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని, తానేదైనా గట్టిగా మాట్లాడితే వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయని, అందుకే తాను ఎక్కువగా మాట్లాడడంలేదని వివరణ ఇచ్చారు. తెలంగాణ విద్యుదుత్పత్తి అంశంపై మరో లేఖ రాయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అనుమతి లేని జలాల వాడకంపై కేఆర్ఎంబీకి లేఖ రాయాలని స్పష్టం చేశారు. జలవివాదాలపై ప్రధానికి కూడా లేఖ రాయాలని భావిస్తున్నట్టు తెలిపారు.

“తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నా. అందుకే నేను సంయమనం పాటిస్తున్నా. కానీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి? తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు” అంటూ సీఎం జగన్ తీవ్రస్వరంతో స్పందించారు. జల వివాదాల అంశంలో ఏంచేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/