కడపలో రెండో రోజు సీఎం జగన్ పర్యటన

కడప: సీఎం జగన్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం.. రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు (డిసెంబర్ 24) ఉదయం వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.40 గంటలకు పులివెందుల పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పార్క్‌లో ఆదిత్య బిర్లా యూనిట్‌కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం వైఎస్సార్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీలో ఇళ్ళ పట్టాల పంపిణీ, బహిరంగ సభలో లబ్ధిదారులతో ముఖాముఖిలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మార్కెట్‌ యార్డుకు చేరుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాణితోపు సమీపంలో ఆక్వాహబ్‌ ప్రారంభోత్సవం చేస్తారు. సాయంత్రం 5.05 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు.

ఇక, మూడో రోజు పర్యటనలో భాగంగా రేపు(శనివారం) పులివెందుల భాకరాపురం సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో ఏర్పాటుచేసిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ ను ప్రారంభిస్తారు. అనంతరం కడప పర్యటన ముగించుకుని తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/