జనాభా పెంచేందుకు చైనా ప్రభుత్వం కొత్త చట్టాలు

China cracks down on costly ‘bride price’ custom to boost falling birth rate

బీజింగ్‌ః జనాభా పెంచేందుకు చైనా ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలను రూపొందిస్తున్నది. ఇప్పటికే ఒకే బిడ్డ విధానాన్ని సడలించింది. అలాగే పలు పన్ను రాయితీలు ప్రకటించింది. అయినా.. జనాభా పెరుగకపోవడంతో తాజాగా మరో నిర్ణయం తీసుకున్నది. ‘బ్రైడ్‌ ప్రైస్‌’ను రద్దు చేసింది. త్వరగా వివాహాలు చేసుకోవడంతో పాటు ఎక్కువ మంది పిల్లలనుకనే అవకాశం ఉందని భావిస్తున్నది. అయితే, పెళ్లి సమయంలో అబ్బాయిలు అమ్మాయిలకు కట్నం ఇవ్వడం ఇక్కడి సంప్రదాయం. వివాహ వేడుకలు ఏడాది పొడవునా జరుగుతాయి. అంతే కాకుండా పెళ్లి విషయంలో చాలా ఖర్చు అవుతుంది. దాంతో చాలా మందికి పెళ్లిళ్లు జరుగడం లేదు. ఈ క్రమంలో ఈ సంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది.

ఇంతకు ముందు చైనా ప్రభుత్వం వివాహం చేసుకోకుండానే.. పిల్లలను కనేందుకు ఆమోదం తెలిపింది. జనాభా పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేసుకుంటోంది. గత కొన్ని దశాబ్దాలుగా చైనాలో జననాల రేటు భారీగా తగ్గుతుంది. అదే సమయంలో వృద్ధ జనాభా ఎక్కువైంది. యువత, శ్రామిక శక్తి తగ్గింది. దీంతో ఖంగుతిన్న చైనా.. గత కొన్నేళ్లుగా జనాభాను పెంచేందుకు అనేక పథకాలను ప్రారంభించింది. వరకట్న వ్యవస్థకు వ్యతిరేకంగా జనం సైతం గొంతెత్తుతున్నారు. ఇందు కోసం అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. మరో వైపు మహిళా దినోత్సవం సందర్భంగా చైనా ప్రభుత్వం చాలాచోట్ల సామూహిక వివాహాలను నిర్వహిస్తున్నది.

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ నిబంధనలను మార్చింది. ఇప్పుడు వివాహం చేసుకోకుండా పిల్లలు కన్న వారికి ప్రసూతి సెలవులు, వైద్య ఖర్చులను అందించడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ సౌకర్యాలు ఇప్పటివరకు వివాహమైన జంటలకు మాత్రమే అందుబాటులో ఉన్నది. సిచువాన్ చైనాలో 5వ అతిపెద్ద ప్రావిన్స్. ఇక్కడ జనాభా ఎనిమిదిన్నర మిలియన్లు. ఇటీవల ఈ సంఖ్య భారీగా తగ్గుతున్నది. తాజా నిర్ణయంతో సిచువాన్‌ ప్రావిన్స్‌ దేశంలో మిగతా ప్రాంతాల కంటే ఓ అడుగు ముందుకువేసింది. సిచువాన్‌లో పిల్లల సంఖ్యపై ఉన్న అన్ని పరిమితులను తొలగించింది. పెళ్లి చేసుకొని పిల్లలు కనే వారికి వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నది. భార్యాభర్తలు ఒకరితో ఒకరు గడిపి జనాభాను పెంచడంలో భాగస్వాములు కావాలన్నది ఈ పథకం ఉద్దేశం. గతంలో చైనాలో వివాహానికి మూడు రోజుల వేతనంతో కూడిన సెలవులు మాత్రమే ఉండేవి.