మోడీ సర్కార్ ఢీ కొట్టిన ఏకైక మొనగాడు సీఎం కేసీఆర్ – వైస్సార్సీపీ ఎమ్మెల్యే కామెంట్స్
మోడీ సర్కార్ ఢీ కొట్టిన ఏకైక మొనగాడు సీఎం కేసీఆర్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు వైస్సార్సీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి. గురువారం ఈయన మాట్లాడుతూ..దేశంలో మోడీ ప్రభుత్వాన్ని ఢీకొట్టిన ఏకైక మొనగాడు సీఎం కేసీఆరే అని.. బీజేపీ అధికారం లేని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఆఫర్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక తాటి పైకి వచ్చి.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్దం కావాలన్నారు. లేకపోతే.. ఇండియానే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను దేశ యువత గుర్తుంచుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ తరహాలోనే.. అందరూ కేంద్రం పై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని.. లేకపోతే.. ప్రమాదం తప్పదని హెచ్చరించారు.
మోడీ రైతు వ్యతిరేకి, కూలీలకు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని గంటల తరబడి మాట్లాడతారని.. అందులో సబ్జెక్ట్ ఉండదన్నారు. వాగ్దాటితో మాయ మాటలు చెబుతారని.. తిరుపతి సాక్షిగా ప్రధాని మోదీ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని.. ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీతో దాడులు చేయించి భయపెడుతున్నారని ఆరోపించారు. గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచినా చెన్నకేశవ రెడ్డి..ఇప్పుడు ప్రధాని ఫై వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.