కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర…

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. ఈరోజు ఉదయం జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం పాంనూర్ నుంచి తన పాదయాత్రను మొదలుపెట్టారు. ఉప్పుగల్, కూనూర్, గర్మెపల్లి, నాగపురం మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. రేపు భద్రకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది సంజయ్ పాదయాత్ర. మరోపక్క రేపు హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో నిర్వహించ తలపెట్టిన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు. సభకు అనుమతి లేదని గురువారం రాత్రి పోలీసులు చెప్పారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు వాట్సాప్‌లో లేఖ పంపారు. అలాగే, గ్రౌండ్‌ కోసం ఇచ్చిన రూ.5 లక్షలు తిరిగి ఇస్తామని తెలిపారు.

దీంతో రావు పద్మతో పాటు బీజేపీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి తదితరులు హన్మకొండ ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నా పర్మిషన్‌ తెచ్చుకున్నామని, ఇప్పుడు సభకు కూడా కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగానే శుక్రవారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేయనున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. కాగా, ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.