మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకున్నచంద్రయాన్–3

అంతరిక్ష నౌక నుంచి విడిపోయిన ల్యాండర్ ‘విక్రమ్’
ఈనెల 23న చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై ల్యాండింగ్

Chandrayaan-3.. Vikram lander successfully separates from propulsion

న్యూఢిల్లీః చంద్రయాన్–3 జాబిల్లి వైపు వడివడిగా.. ఒక్కో దశను దాటుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఈ రోజు మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. అంతరిక్ష నౌక నుంచి ల్యాండర్ ‘విక్రమ్’ విడిపోయింది. ఈ రోజు నుంచి ల్యాండర్.. చంద్రుడి చుట్టూ తిరగనుంది. ఈనెల 23న చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై ల్యాండ్ కానుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఇస్రో వెల్లడించింది. ‘‘ఎల్‌ఎం (ల్యాండర్ మాడ్యూల్) విజయవంతంగా ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం) నుంచి వేరుపడింది. రేపు నిర్వహించే డీబూస్టింగ్ తర్వాత.. ల్యాండర్‌‌ మాడ్యూల్‌ మెల్లగా తక్కువ కక్ష్యలోకి వెళ్తుంది” అని ఇస్రో తెలిపింది. రేపు సాయంత్రం 4 గంటలకు డీబూస్టింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది.

ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన తర్వాత.. ల్యాండర్‌‌ను డీబూస్ట్ (వేగాన్ని తగ్గించే ప్రక్రియ) చేయనున్నారు. పెరిలున్‌ (చంద్రుడికి అత్యంత దగ్గరి ప్రదేశం)కు 30 కిలోమీటర్లు, అపోలూన్‌ (చంద్రుడకి దూరంగా ఉన్న ప్రదేశం)కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో ల్యాండర్‌‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్బిట్‌లోకి ల్యాండర్ చేరుకున్న తర్వాత.. 23వ తేదీన సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ప్లాన్ చేసినట్లు ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై దిగిన వెంటనే.. ప్రజ్ఞాన్ రోవర్ ఫొటోను ల్యాండర్ తీస్తుంది. తర్వాత రోవర్ రంగంలోకి దిగి పరిశోధన ప్రారంభిస్తుంది.