‘భీమ్లా నాయక్’ పై ఏపీ ప్రభుత్వ వ్యవహారం ఉగ్రవాదాన్ని తలపిస్తోంది : చంద్రబాబు
రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం జగన్ వదలడం లేదు
అమరావతి: ఏపీలో భీమ్లా నాయక్ సినిమా విడుదల వేళ థియేటర్లలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచే రెవెన్యూ సిబ్బంది ద్వారా అధికారులు థియేటర్లపై నిఘా పెంచి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని థియేటర్ల యాజమాన్యాన్ని హెచ్చరించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం జగన్ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది
వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్… తన మూర్ఖపు వైఖరి వీడాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి… థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగుదేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది… నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్లు చేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/