తాడేపల్లిలో కంటిచూపు బాలిక హత్య..చంద్రబాబు దిగ్భ్రాంతి

లైంగిక వేధింపులకు పాల్పడిన రౌడీషీటర్

chandrababu

అమరావతిః గుంటూరు జిల్లా తాడేపల్లిలో కంటిచూపు లేని ఓ బాలిక దారుణ హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన రాజు అనే రౌడీ షీటర్… వేధింపుల విషయాన్ని బాలిక ఇంట్లో చెప్పడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మెడపై కత్తితో నరకడంతో తీవ్రంగా గాయపడిన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ఈ ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. తాడేపల్లిలో సీఎం నివాసానికి కూతవేటు దూరంలో బాలిక హత్య షాక్ కు గురిచేసిందని తెలిపారు. కంటిచూపు లేని బాలికను వేధించడమే కాకుండా, దారుణంగా హతమార్చడం దిగ్భ్రాంతి కలిగించిందని వెల్లడించారు. సీఎం నివాస ప్రాంతంలో రౌడీషీటర్లు, గంజాయి బ్లేడ్ బ్యాచ్ ల స్వైరవిహారం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దుస్థితికి నిదర్శనం అని చంద్రబాబు విమర్శించారు.