అరెస్ట్ తర్వాత చంద్రబాబు ఏమన్నారంటే..

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్ట్‌ చేసింది ఏపీ సీఐడీ. శనివారం ఉదయం నంద్యాలలో హైడ్రామా తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. 3వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తారని సమాచారం.

అరెస్ట్ తర్వాత చంద్రబాబు మీడియా తో మాట్లాడారు. తన అరెస్టు మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్యచేశారంటూ అరెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అడ్డుకుంటున్నారని, తాను తప్పు చేస్తే నిరూపించాలని సవాలు విసిరారు. తాను ప్రజల తరపున న్యాయంగా పోరాడుతున్నానని, చివరకు ధర్మమే గెలుస్తుందని అన్నారు. ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.

తాను ప్రజాసమస్యలపై పోరాడుతున్నానని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు వందల మంది టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారని, ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అణచివేయాలని చూస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.