ఈటలకు ‘వై ప్లస్’, అర్వింద్‌కు ‘వై’ కేటగిరీ భద్రత: కేంద్రం !

ఈటలకు ఇప్పటికే ‘వై ప్లస్’ భద్రత కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

center-increased-security-bjp-etela-rajender-mp-dharmapuri-arvind

న్యూఢిల్లీః తెలంగాణలో ఇద్దరు బిజెపి నేతలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఈట‌ల రాజేందర్‌కు ‘వై ప్లస్’, అర్వింద్‌కు ‘వై’ కేటగిరీ భద్రతను కేంద్రం కేటాయించింది. వీరిద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో భద్రత కల్పించింది. ఈటలకు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ సిబ్బంది సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్‌కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి.

కాగా, ఇప్పటికే ఈటల రాజేందర్‌కు తెలంగాణ సర్కార్‌ ‘వై ప్లస్‌’ భద్రత కల్పించిన విషయం తెలిసిందే. ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయన హత్యకు ప్లాన్‌ జరుగుతోందన్న ప్రచారంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ వెహికల్‌ సహా 16 మందితో సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.