విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగలేదుః కేంద్రం

పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడి

center-gave-a-big-twist-on-the-vizag-steel-plant

న్యూఢిల్లీః వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేదని స్పష్టం చేసింది. సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని వెల్లడించింది. ప్రభుత్వం, కంపెనీ సహకారంతో ఉప సంహరణ ప్రక్రియ నడుస్తోందని తెలిపింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తాము ముందుకు వెళ్లడం లేదని, సంస్థను బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర ఉక్కు శాఖ ప్రకటన విడుదల చేసింది.

‘‘రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ఆగిపోలేదు. ఈ ప్రక్రియ పురోగతిలో ఉంది. మరింత మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ప్రకటనలో తెలిపింది. ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నిలిచిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా రిపోర్టుల్లో నిజం లేదని చెప్పింది.