దాసోజు శ్రవణ్‌ ఆఫీస్ లో సంబరాలు

బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌ ఆఫీస్ లో సంబరాలు మొదలయ్యాయి. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ గా ప్రకటించారు. ఈ ప్రకటన తో ఆయన అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ ను సైతం ఎమ్మెల్సీ గా ప్రకటించారు. ఎమ్మెల్సీలు ఫారూక్‌ హుస్సేన్‌, రాజేశ్వరరావు పదవీకాలం ముగియడంతో వారి స్థానాల్లో వీరిని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ బీసీ వర్గాల బలమైన గొంతుకగా ఎదిగారు. మంచి వాక్చాతుర్యం, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడం, జాతీయ మీడియాతో మాట్లాడే, తెలుగు, జాతీయ మీడియా డిబేట్‌లో సైతం పాల్గొని పార్టీ గళం వినిపించేవారిలో దాసోజు ముందు వరుసలో ఉంటారు. ప్రజారాజ్యంలో కొంతకాలంపాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి పలు హో దాల్లో పనిచేశారు. తెలంగాణ కోసం కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి బీఆర్‌ఎస్‌ సమర్పించిన చారిత్రక నివేదిక రూపకల్పన బృందం లో సభ్యుడిగా పనిచేశారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా తనపేరు ప్రతిపాదించడంపై సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.