రాజస్థాన్ సీఎం సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు

గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ నివాసం, ఇతర ప్రాంతాల్లో సోదాలు
అవినీతి కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ దాడులు

జోధ్ పూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ నివాసంపై సీబీఐ దాడులు చేసింది. జోధ్ పూర్ లోని ఆయన నివాసంతో పాటు పలు చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అగ్రసేన్ గెహ్లాట్ పై అవినీతి కేసును నమోదు చేసిన సీబీఐ… ఈరోజు దాడులు జరిపింది. మరోవైపు సీబీఐ దాడులపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే సీబీఐ చేత దాడులు చేయిస్తోందని బీజేపీపై మండిపడ్డారు.

ఒక ఫర్టిలైజర్ ఎక్స్ పోర్ట్ కేసులో ఇప్పటికే ఈడీ నిఘాలో అగ్రసేన్ గెహ్లాట్ ఉన్నారు. 2007 – 2009 మధ్యలో పెద్ద మొత్తంలో ఫర్టిలైజర్ ను ఇల్లీగల్ గా ఎగుమతి చేశారంటూ ఈడీ ఆరోపించింది. దీనికి సంబంధించి ఈడీ ఇప్పటికే విచారణ చేపట్టింది. మనీ లాండరింగ్ చట్టం కింద అగ్రసేన్, ఆయన సంస్థ అనుపమ్ కృషి, మరి కొందరిపై విచారణ జరుపుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/