పోలీసుల అదుపులో బండి సంజయ్

బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్తుండగా సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర వెళ్తున్న సంజయ్ ను మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా బికనూర్ వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మూడు రోజులుగా నిరసన చేపట్టారు. దాదాపు ఎనిమిది వేల మంది విద్యార్థులు క్యాంపస్ లో బైఠాయించారు. గురువారం వర్షంలోనూ తమ నిరసనను కొనసాగించారు. ట్రిపుల్ ఐటీకి ఉప కులపతిని నియమించడంతో పాటు బోధన సిబ్బందిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

చాన్నాళ్లుగా తమకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని, క్యాంపస్ లో కనీస సౌకర్యాలు కూడా లేవని విద్యార్థులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గానీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గానీ క్యాంపస్ కు వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని చెబుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/