గుడివాడ ఆర్ఐపై హత్యాయత్నం కేసు.. 9 మంది అరెస్ట్

గుడివాడ: గుడివాడలో అర్బన్ ఆర్ఐ జాస్తి అరవింద్ పై మట్టి మాఫియా దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయనను జేసీబీతో నెట్టివేసి దాడికి పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అరవింద్ ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్న పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో రాధాకృష్ణ, లక్ష్మణరావు ప్రధాన నిందితులుగా భావిస్తున్నారు. కాగా, అరెస్టయిన వారిలో ఓ బాల నేరస్థుడు కూడా ఉన్నాడు.

అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకునే యత్నంలో ఆర్ఐ అరవింద్ సంఘటన స్థలానికి రాగా, రాధాకృష్ణ, లక్ష్మణరావు తదితరులు ఆయనను జేసీబీతో నెట్టివేసి, గొంతు నులుముతూ, ముఖంపై దాడి చేశారు. ఈ ఘటనలో అరవింద్ చొక్కా చిరిగిపోవడమే కాదు, మెడలో బంగారు చెయిన్ కూడా తెగిపోయింది.

ఈ ఘటనపై ఆర్ఐ తహసీల్దారు శ్రీనివాసరావుకు సమాచారం అందించడంతో, పలువురు వీఆర్వోలు అక్కడికి చేరుకున్నారు. అనంతరం, అరవింద్ తనపై జరిగిన దాడి పట్ల తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా, గతంలో తహసీల్దారు శ్రీనివాసరావుపైనా ఇదే తరహాలో పలువురు దౌర్జన్యం చేసినట్టు తెలుస్తోంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/