కాసాని జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదు

case-filed-against-kasani-gnaneshwar-in-banjara hills-police-station

హైదరాబాద్‌ః తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదైంది. గుడిమల్కాపూర్‌కు చెందిన టిడిపి సమన్వయకర్త డాక్టర్ ఏఎస్‌రావు ఆయనపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమావేశాలకు హాజరు కావాలంటూ ఫోన్ వస్తే గత నెల 29న కార్యాలయానికి వెళ్లానని కానీ, తనను లోపలికి వెళ్లకుండా కార్యాలయం వద్ద జ్ఞానేశ్వర్, ప్రకాశ్ ముదిరాజ్, భిక్షపతి ముదిరాజ్, రవీంద్రాచారి, బంటు వెంకటేశం, ఐలయ్య యాదవ్, ప్రశాంత్ యాదవ్ తదితరులు తనపై దాడిచేశారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటనలో తన కుడికంటిపై గాయమైందని తెలిపారు.

మరోవైపు డాక్టర్ ఏఎస్‌ రావుపైనా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్టోబర్ 29న పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన అమర్యాదగా వ్యవహరిస్తూ నానా రభస చేశారని గోషామహల్ ఇన్‌చార్జి ప్రశాంత్ యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఈ ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.